యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు. అయితే, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదిలాఉంటే.. సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ఆలయ పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయశాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియ తీరును, తొడుగులు తయారీపై స్వర్ణకారులను భూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.