రేపు యాదాద్రికి కేసీఆర్‌.. నిర్మాణ పనుల పరిశీలన..

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొత్త రూపును సంతరించుకుంటోంది.ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణ పనుల్ని చేపడుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్చి 4న యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. సర్వలోక శరణ్యుడు శ్రీ లక్ష్మీనరసింహుడి దివ్యక్షేత్రం యాదాద్రి.

ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో సందర్శించనున్నట్లు సమాచారం. కాగా, ప్రధాన ఆలయంతోపాటు క్యూలైన్‌, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనులను పరిశీలించనున్నట్టు సమాచారం. అక్కడే ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తారని తెలిసింది. అయితే యాదాద్రి ప్రధాన ఆలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోలను నిర్మించనున్న స్థలాలను కేసీఆరర్‌ పరిశీలించనున్నారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించి నిర్మాణ పనులై అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అనంతరం లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ప్రారంభోత్సవ ముహూర్తం తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు సన్నద్దమవుతున్నారు. సీఎంవో నుంచి అందిన సమాచారం మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం రోజుల పాటు సీఎం పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.అయితే ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే జోరందుకున్నాయి. అన్ని హంగులతో యాదాద్రి ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నారు.