తిరుపతి ఉపఎన్నికలో వైకాపా విజయం

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు. ఆయన 2.31 లక్షలకు పైగా మెజారిటీతో తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై గెలుపొందారు. ఫ్యాన్ ధాటికి టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి. గురుమూర్తి విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటుతోంది.

మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి తిరుపతి బరిలో వైసీపీకి 5,33,961 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,02,580 ఓట్లు లభించాయి. ఆ తర్వాత స్థానంలో బీజేపీ-జనసేనకు 50,354 ఓట్లు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ మొత్తం ఓట్లు ఇప్పటిదాకా కనీసం లక్ష కూడా దాటలేదు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 8,406… సీపీఎంకు 4,978, ఇతరులకు 30,381, నోటాకు 13,175 ఓట్లు వచ్చాయి.