మీరు బలంగా మారండి.. పార్టీని బలోపేతం చేయండి

• జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దాం
• పిఠాపురం నియోజకవర్గ నాయకులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘ఇంట్లో కూర్చుని గెలిచేయాలి.. అధికారం వచ్చేయాలంటే కుదరదు. పార్టీ కోసం కష్టపడే నాయకులుగా మీరు మరింత మందిని కలుపుకొని ముందుకు వెళ్లాలి. అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా? పార్టీ ఉన్నతి కోసం బలంగా కష్టపడాలి. మనందరిలో సమన్వయం అనేది ప్రధానం. నిజాయతీని నమ్ముకున్న పార్టీ మనది. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం గొల్లప్రోలులో ఓ ఫంక్షన్ హాల్లో పిఠాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు, సమస్యలపై చర్చించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కులాలు , వర్గాలను దాటి రాజకీయం చేయాలి. ఒక కులానికి ఒక పార్టీ అన్న పద్దతి ఉండకూడదు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. నాయకత్వమంతా ఒకే తరహా ఆలోచనలో ముందుకు వెళ్లాలి. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా కులాలన్నీ కలసికట్టుగా నడవాలన్నదే నా ఆలోచన. నేను విలువలు చెప్పను… వాటిని పాటించే వ్యక్తిని. కొత్తతరం నాయకుల్ని తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. తెలుగుదేశం, వైసీపీ లాంటి పార్టీలకు ఇన్ స్టెంట్ గా అనుభవం ఉన్నా నాయకులు దొరికేశారు. వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఎదురెళ్తున్నాం. నాయకులుగా మీరు ముందుగా నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకోండి. పని చేసుకుంటూ ముందుకు వెళ్లండి” అని చెప్పారు.