గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలపై యూత్ కాంగ్రెస్ నిరసన
న్యూఢిల్లీ: వంటకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగడంపై యూత్ కాంగ్రెస్ సభ్యులు ఢిల్లీలో శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళా కార్యకర్తలు సాంప్రదాయ కట్టెల పొయ్యిపై వంట చేశారు. మరోవైపు యువకులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.
మరి కొందరు గ్యాస్ సిలిండర్లను బండిపై ఉంచి ధరల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన గ్యాస్ ధరలను పేద ప్రజలు భరించలేరని, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు ఫ్లకార్డులను కూడా ప్రదర్శించారు. కాగా, ఈ నిరసన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.