నేడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ నగదు జమ

ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల మహిళలకు వరుసగా రెండో ఏడాది కూడా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం అమలు కానుంది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఏడాది కూడా వడ్డీని ఏపీ ప్రభుత్వం బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను జమ చేయనుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం మహిళల ఖాతాల్లో జమచేయనున్నారు. 1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ రూ. 1,109 కోట్లు నిధులను ప్రభుత్వం తరపున ఆయా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ ఆన్‌లైన్ ద్వారా జమచేయనున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన మహిళలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జ్ మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్‌ 24న చెల్లించారు. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను ఈ రోజు జమచేయనున్నారు.

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తసుకోని సకాలంలో చెల్లిస్తున్నారు. ఇప్పుడు వారంతా ప్రయోజనం పొందనున్నారు. దీనికి సంబంధించి గ్రామస్థాయిలో సభలు నిర్వహించి ప్రభుత్వం వివరాలను సేకరించింది. ఈ మేరుకు సీఎం జగన్‌ పొదుపు సంఘాల మహిళలకు లేఖలు రాశారు. ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందని వివరించారు.