పవన్ చిత్రానికి కలం పట్టిన త్రివిక్రమ్.. అధికారిక ప్రకటన

ఓ పక్క దర్శకుడిగా బిజీగా వున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా తన మిత్రుడు పవన్ కల్యాణ్ కోసం కలం పడుతున్నాడు. మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడీ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు సంభాషణలను కూడా రాస్తున్నారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సెల్యులాయిడ్ మెజీషియన్ కి తమ సినిమా కుటుంబ పరివారంలోకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ సోషల్ మీడియాలో పేర్కొంది. జనవరి 22 నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా తెలిపింది.

ఇక గతంలో పవన్ నటించిన ‘తీన్మార్’ సినిమాకి కూడా త్రివిక్రమ్ మాటలు రాసిన సంగతి చాలామందికి తెలిసిందే. ఇదిలావుంచితే, ఓపక్క క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తున్న పవన్.. ఈ మలయాళ రీమేక్ కి 40 రోజుల డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.