యూపీలో ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్ – ఆగ్రా రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మినీ బస్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను సీఎం యోగి ఆదేశించారు.