జలియన్ వాలాబాగ్ అమరులకు నివాళి: ప్రధాని మోడీ
జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళి అర్పించారు. వారు కనబరచిన అద్వితీయమైన ధైర్య సాహసాలు, త్యాగం ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయన్నారు. నేటితో ఆ నరమేధం జరిగి 102 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆయన ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జలియన్ వాలాబాగ్ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ట్విటర్ వేదికగా జలియన్ వాలాబాగ్ అమరవీరులకు నివాళి అర్పించారు. ‘అమరులకు నా నివాళులు. ఎన్నేళ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మెదులుతుంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏప్రిల్ 13, 1919లో జరిగింది.
బ్రిటిష్ పాలకులు తెచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన సఫియుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ అనే ఇద్దరు నాయకుల్ని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని ప్రజలు డిమాండు చేశారు. వైశాఖి పర్వదినం నేపథ్యంలో జలియన్ వాలాబాగ్లో భారీగా సమావేశమయ్యారు. జనాలు గుంపులుగా సమావేశం కావడంపై కోపోద్రిక్తుడైన జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు. దీంతో బలగాలు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 500 పైగా అమాయక పౌరులు మరణించారని నాటి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు మదన్మోహన్ మాలవీయ ఓ నివేదికలో పేర్కొన్నారు.