స్వామిత్వ పథకం.. ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి ప్రధాని శ్రీకారం

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీకి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 4.09 లక్షల ఆస్తి యజమానులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పాల్గొననున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులను సైతం ప్రధాని ప్రదానం చేయనున్నారు.

224 పంచాయతీలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరన్‌ పురస్కార్‌ అవార్డులు, 30 పంచాయతీలకు నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కార్‌ , 30 పంచాయతీలకు చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డులు,12 రాష్ట్రాలకు ఈ పంచాయతీ పురస్కార్‌ అవార్డులను ప్రధాని ప్రదానం చేయనున్నారు. అలాగే, ఈ సందర్భంగా ప్రధాని అవార్డు ప్రైజ్‌మనీని సైతం పంచాయతీ బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయనున్నారు. మొదటిసారిగా విధానాన్ని అమలు చేస్తున్నారు.