నేడు హనుమజ్జయంతి.. ఈ శ్లోకాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయం

హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించాడట. కనుక అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది.

ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు.

ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున హనుమాన్‌ చాలీసా, హనుమద్దండకం ఇతర శ్లోకాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని అంటారు.