మన్మోహన్‌ జీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది: కాంగ్రెస్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఆరోగ్యంగా ఉన్నారని, గురువారం కంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కాంగ్రెస్‌ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ సెక్రటరీ ప్రణవ్ ఝా ట్వీట్ చేశారు.

‘మన్మోహన్‌ సింగ్‌జీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. నిన్నటికంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన వేగంగా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం. అనవసరమైన ఊహాగానాలకు తావివ్వొద్దు. మాజీ ప్రధాని గోప్యతను మనమంతా గౌరవిద్దాం’ అంటూ ప్రణవ్‌ ఝా వెల్లడించారు. ఇటీవల జ్వరం బారినపడి మన్మోహన్ కోలుకున్నారు. అయితే నీరసంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బుధవారం కుటుంబసభ్యులు ఆయన్ను దిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆసుపత్రికి వెళ్లి, మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.