ఆపదలో కార్యకర్తలకు అండ క్రియాశీలక సభ్యత్వం

• పార్టీ కోసం కష్టపడిన జన సైనికుల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాం
• జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
• విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యుల
కుటుంబాలకు పరామర్శ

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వడం కోసమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియ ప్రారంభించినట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పార్టీ మీ వెంట ఉంటుందన్న ధైర్యం నింపేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీమా చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ నిర్మాణంలో భాగస్వాములైన జనసైనికుల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే విధంగా పార్టీ పని చేస్తుందన్నారు. మంగళవారం ఇటీవల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ బగ్గు పవన్ సాయి, శ్రీ చందన ఆంజనేయులు కుటుంబాలను శ్రీ మనోహర్ గారు పరామర్శించారు. పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ సాయి తల్లి శ్రీమతి సూర్యకుమారి, ఆంజనేయులు భార్య శ్రీమతి కరుణలకు పార్టీ తరఫున రూ.5 లక్షల బీమా చెక్కులను అందచేశారు. వారిని ఓదార్చి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా స్వీకరించి వారికి అండగా నిలిచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో తీసుకువచ్చిన కార్యక్రమం.. క్రియాశీలక సభ్యత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 6 లక్షల 46 వేల మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపర్చే విధంగా పని చేసిన నిబద్దత కలిగిన జనసైనికుల్ని కోల్పోవడం దురదృష్టకరం. పార్టీ, పార్టీ నాయకత్వం ఆ కుటుంబాలకు ఎప్పుడూ అండగా నిలుస్తుంది” అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మండలి రాజేష్, అధికార ప్రతినిధి శ్రీ అక్కల రామ్మోహన్ రావు, సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.