బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఇటీవల అరెస్ట్ కాగా, తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిపై ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మోసం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ‘అయోసిన్ వెల్‌నెస్’ పేరుతో శిల్పాశెట్టి ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి ఆమె చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్ మరో బ్రాంచ్‌ను ప్రారంభించే ఉద్దేశంతో జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరి నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారు.

దీంతో బాధితులు వీరిద్దరిపై లక్నోలోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం శిల్ప, ఆమె తల్లికి నోటీసులు పంపారు. అలాగే, ఈ కేసు దర్యాప్తు కోసం సంజీవ్ సుమన్ అనే పోలీసు అధికారి ముంబై వెళ్తున్నారు.