డ్రాగన్ ను అడ్డుకొనేందుకు తన వంతు పాత్ర పోషిస్తున్న బీఆర్ఓ

చైనాతో వాస్తవాధీన రేఖ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత జవాన్లకు అన్ని విధాలుగా సహాయపడేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలను ముమ్మరం చేస్తోంది. సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ(బీఆర్ఓ) కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. లేహ్కు అనుసంధానించేందుకు చేపట్టిన రోడ్డు నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని సత్వరమే పూర్తిచేసేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తోంది. వాటితో పాటు కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను శుభ్రం చేస్తోంది. అవసరమైన చోటకు భారీ యంత్రాలను తీసుకెళ్లేందుకు సైన్యానికి ఈ రోడ్లు ఉపయోగపడతాయనే కారణంతో ఈ చర్యలు చేపట్టింది.

బీఆర్ఓ అధికారుల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలను కొనుగోలు చేశారు. వీటితో రోడ్ల నిర్మాణం వేగవంతమవుతుందని ఆశిస్తున్నారు. కూలీలను పనిలోకి తీసుకుని నిరంతరం పనిచేయిస్తున్నారు. సరిహద్దులో ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారీ యంత్రాలను మోహరించారు. శీతాకాలంలో మంచును తొలగించేందుకు వీటిని వినియోగించనున్నారు. ఇటీవలే పాండమ్-యుల్చుంగ్-సుమ్దో ప్రాంతాన్ని.. ఒకటో నంబర్ జాతీయ రహదారిలోని ఖాల్సితో అనుసంధానిస్తూ ఓ రోడ్డును నిర్మించింది బీఆర్ఓ. ఇది సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.