ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లకు కరోనా

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో ఇద్దరు కరోనా బారినపడ్డారు. అయితే, బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు బృందంలో 23 మంది ఉన్నారు. వీరిలో కరోనా బారినపడింది ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు.

కరోనా బారినపడిన ఆ క్రికెటర్లలో ఎలాంటి లక్షణాలు లేవని, వారిలో ఒకరు ఇప్పటికే కోలుకోవడంతో అతనికి పరీక్షలో నెగటివ్ వచ్చిందని తెలుస్తోంది. మరో క్రికెటర్ ని మాత్రం క్వారంటైన్‌లో ఉంచినట్టు సమాచారం. క్వారంటైన్‌లో ఉన్న ఆ క్రికెటర్‌ను వదిలిపెట్టి మిగతా క్రికెటర్లు డర్హమ్‌కు బయలుదేరారు.