భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మార్చి 4న మన్మోహన్ సింగ్​, ఆయన సతీమణి గుర్​శరణ్​​ కౌర్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకోవడం గమనార్హం. మరోవైపు దేశంలో కోవిడ్ తీవ్రమవుతోందని, నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఇటీవల మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను 5 సూత్రాలతో కట్టడి చేయవచ్చని వివరించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధానంగా పిలుపునిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు మన్మోహన్ ఇవాళ కరోనా బాధితుల జాబితాలో చేరారు. దీంతో మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ పార్టీల కతీతంగా వివిధ పార్టీల కీలకనేతలు తమ సందేశాలిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలని తమ తమ ఆకాంక్షలను వివిధ రూపాల్లో సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.