5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. సాయంత్రానికి పూర్తి ఫలితాలు!

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఇటీవల పలు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. మధ్యాహ్నానికి ఫలితాలపై ఓ అంచనా రానుండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. లెక్కింపు కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. కాగా, వివిధ కారణాల వల్ల గతం కంటే పోస్టల్ బ్యాలెట్లు ఈసారి నాలుగురెట్లు పెరిగాయి.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సరళి మరో రెండుమూడు గంటల్లో తెలిసిపోనుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎం. గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక బరిలో 41 మంది ఉన్నారు.