తక్కువ దూరాలకు రైల్వే చార్జీలు రెట్టింపు

న్యూఢిల్లీ : అనవసర ప్రయాణాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో .. రైలు చార్జీలను పరిమితంగా పెంచామని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే తక్కువ దూరాల ప్రయాణాలను లక్ష్యంగా చేసుకొని ఛార్జీలను పెంచామని ప్రకటిస్తున్నప్పటికీ.. ధరలను భారీగానే పెంచారు. అమృత్‌సర్‌ నుండి పఠాన్‌కోట్‌ (107 కిలోమీటర్లు) వెళ్లడానికి సెకండ్‌ సీటింగ్‌ రిజర్వ్‌డ్‌ టికెట్‌ ధరను రూ.25 నుంచి రూ.55కు పెంచారు. అలాగే, జలంధర్‌ సిటీ నుంచి ఫిరోజ్‌పూర్‌కు (118 కిలోమీటర్లు) రూ.30గా ఉన్న పాసింజర్‌ డిఎంయు రైల్వే చార్జీని రూ.60కి పెంచేశారు. దేశంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో.. అనవసర ప్రయాణాలను అడ్డుకునేందుకే చార్జీలను పెంచామని రైల్వే శాఖ వెల్లడించింది. మరోవైపు ఎక్కువ దూరాలకు ప్రయాణించే రైలు టికెట్లపైనా రూ. 10 నుండి 30 అదనంగా వసూలు చేస్తున్నారు.