గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రమాదమేమీ లేదు: జే షా
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని బోర్డు కార్యదర్శి జే షా వెల్లడించారు. ఛాతీలో నొప్పి అంటూ గంగూలీ కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, యాంజియోప్లాస్టీ అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం దాదా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాను గంగూలీ కుటుంబంతో మాట్లాడానని, దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు జే షా ట్వీట్ చేశారు.
అటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. ఐసీసీ కూడా స్పందించింది. గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్వీట్ చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టాండిన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.