లెబనాన్ కు భారత్ ఆపన్నహస్తం

లెబనాన్ ప్రజలకు భారత దేశం అండగా నిలుస్తోంది. లెబనాన్ చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభ సమయాన్ని ఎదుర్కోంటున్న వారికి భారత్ చేయూత ఇస్తోంది. బీరుట్ లో జరిగిన మహా విస్పోటనం తరువాత ఆ దేశంలో పరిస్థితులు మారిపోయాయి. వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. సుమారు మూడు లక్షల మంది నివాసం కోల్పోయారు. ఇలాంటి సమయంలో భారత దేశం మానవతా కోణంలో ఆలోచించి అత్యవసర వైద్య సరఫరా, సామగ్రీ, ఆహారాన్ని తరలిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన C17 ఎయిర్ క్రాఫ్ట్ లో వీటిని బీరుట్ కు తరలిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

మొత్తం 58 మెట్రిక్ టన్నుల వస్తువులను బీరుట్ కు తరలిస్తున్నట్టు సమాచారం అందించారు. కొన్ని రోజుల క్రితం లెబనాన్ రాజధానిలో భారీ పేలుళ్లు సంభవించాయి. బీరుట్ పోర్టులో నిల్వ చేసి ఉన్న 2,750 టన్నుల అమోనియం నైట్రేట్ పేలడంతో చిన్నపాటి అణుబాంబు పేలిన విధంగా విస్పోటనం జరిగింది. క్షణాల్లోనే చుట్టుపక్కల ఉన్న భారీ భవనాలు నేల మట్టం అయ్యాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్న లెబనాన్ దేశానికి ఈ ప్రమాదం వల్ల సుమారు రూ. లక్షకోట్ల నష్టం వాటిల్లింది అని సమాచారం.