నెలకు రూ. లక్ష ఇస్తానంటే, రూ. 50 లక్షలు ఇచ్చి మోసపోయా: నిక్కీ గల్రానీ

సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’తో పాటు ‘మరకతమణి’, ‘మలుపు’ తదితర చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఓ హోటల్ యజమాని చేతిలో మోసపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే…

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్ ను ప్రారంభించగా, నిక్కీ రూ. 50 లక్షల వరకూ పెట్టుబడిగా పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా తాను నెలకు రూ. 1 లక్ష ఇస్తానని నిఖిల్ హామీ ఇచ్చాడు. ఇన్వెస్ట్ మెంట్ ఇచ్చి ఎంతకాలమైనా నిక్కీకి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె, పోలీసులను ఆశ్రయించి, ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ యజమానిని పిలిచి విచారిస్తున్నామని తెలిపారు.