‘ఒక ప్రపంచం.. ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అమలు చేయాలి: మోదీ

భవిష్యత్ మహమ్మారులను నివారించేందుకు ప్రపంచ దేశాలు ఏకమవ్వాలని, ‘ఒక ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ7 దేశాల సదస్సులో ఆయన తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు అండగా ఉన్న జీ7 దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

‘వసుధైవ కుటుంబం’ అన్న భారత విధానమే.. మహమ్మారి పోరాటంలో ప్రభుత్వ వర్గాలు, పరిశ్రమ వర్గాలు, పౌర వ్యవస్థలు కలిసిరావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య విధానానికి ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, దానికి తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. కరోనా కేసుల గుర్తింపులో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం, వ్యాక్సినేషన్ కోసం వాడిన ఓపెన్ సోర్స్ టూల్స్ చాలా విజయవంతమయ్యాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ అనుభవాలను పంచుకుంటామని చెప్పారు.

ఇక, మేధో సంపత్తి హక్కులపై వాణిజ్య సంబంధిత విషయాలపై భారత్ కు జీ7 మద్దతునివ్వాలని ప్రధాని కోరారు. ఇప్పటికే ఆస్‌టరేలియా వంటి దేశాలు దీనికి మద్దతునిచ్చాయని, అమెరికా మాత్రం టెక్నాలజీ మార్పిడికి సంబంధించి మేధో హక్కులకు మినహాయింపునిచ్చేందుకు ఒప్పుకొందని చెబుతున్నారు.