పవన్ కళ్యాణ్‌తో మూవీ పక్కా అంటున్న బండ్ల ..!

పవన్ కళ్యాణ్ కు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. సినీ ప్రముఖులు ఈయనకు అభిమానులే. అందులో భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ జాబితాలో బండ్ల గణేష్ అందరికంటే ముందు వస్తాడు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడు అని.. మరో మాట లేదు అని.. ఈ జీవితం ఆయనకే అంకితం అంటూ ప్రతిసారి చెబుతూనే ఉంటాడు. పవన్ అంటే ఆయనకు ఎంత పిచ్చి అనేది ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. దానికి తోడు ఆయన నిర్మాతగా మార్చింది కూడా పవన్ కళ్యాణ్. నిజానికి ఆంజనేయులు కంటే ముందు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా పవన్ సినిమా పక్కకు వెళ్లిపోవడంతో రవితేజ సినిమాతో నిర్మాత అయిపోయాడు బండ్ల గణేష్.

ఆ వెంటనే పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ సినిమా నిర్మించాడు. ఇది అనుకున్న ఫలితం రాకపోయేసరికి వెంటనే గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చాడు. ఈ ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన డేట్స్ దొరకడం సులభం కాదు. పైగా ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు. మరో 2 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడం కూడా కష్టమే. ఇలాంటి సమయంలో కూడా బండ్ల గణేష్ ఈయనతో సినిమా చేయబోతున్నాడు. ఆ మధ్య వరుస సినిమాలు చేసి టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన బండ్ల గణేష్.. ఆరేళ్లుగా గ్యాప్ తీసుకున్నాడు.

టెంపర్ తర్వాత ఇప్పటి వరకూ ఆయన మరో సినిమా నిర్మించలేదు. మధ్యలో కొన్ని సినిమాలు అనుకున్న వర్కౌట్ కాలేదు. ఒక సాలిడ్ ప్రాజెక్టుతో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ నిర్మాత. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. తాజాగా ఆయన దగ్గరికి ఒక దర్శకుడిని తీసుకెళ్లి కథ చెప్పి ఒప్పించాడని ప్రచారం జరుగుతుంది. రవితేజతో ఖిలాడి సినిమా తెరకెక్కిస్తున్న రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు చెబుతాను అంటున్నాడు బండ్ల గణేష్.