ఉప్పెన టీంకు పవన్ శుభాకాంక్షలు

మన జీవితాల్ని.. అందులోని భావోద్వేగాల్ని.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారని కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అన్నారు. తన చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా పవన్‌కల్యాణ్‌ను ‘ఉప్పెన’ చిత్రబృందం కలిసింది. సినిమా ట్రైలర్‌ వీక్షించిన అనంతరం పవన్‌కల్యాణ్‌.. వైష్ణవ్‌ తేజ్‌, బుచ్చిబాబుతో పాటు ఇతర చిత్రబృందాన్ని అభినందించారు.

‘హీరోగా తొలి చిత్రంలోనే వైష్ణవ్‌ మంచి కథ ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్‌ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. ‘జానీ’లో బాలనటుడిగా హీరో చిన్నప్పటి పాత్ర పోషించిన అతను ఇప్పుడీ స్థాయికి ఎదిగాడు. బుచ్చిబాబు ఎంతో సమర్థవంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థమవుతోంది. మన జీవితాల్ని.. అందులోని భావోద్వేగాల్ని.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. అందుకే ‘రంగస్థలం’, ‘దంగల్‌’ చిత్రాల్లో ఉండే భావోద్వేగాలు ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’లోని భావోద్వేగాలు కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నా.’ అని పవన్‌కల్యాణ్‌ వివరించారు.