పెగాసస్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ..

భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన, పార్లమెంట్‌ సమవేశాలను కుదిపేస్తోన్న పెగాసస్‌ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్‌ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది.. ఈ వ్యవహారంపై గత గురవారం విచారణ సందర్భంగా పిటిషనర్లను తమ పిటిషన్‌ కాపీలను ప్రభుత్వానికి అందజేయాలని ధర్మసనం సూచించగా. ఈ రోజు ప్రభుత్వ వాదనలు జరగనున్నాయి.

అయితే, పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం కొన్నదా? కొంటే ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది..!? ఎంత సొమ్మును వెచ్చించింది..!? తదితర ప్రశ్నలతో గత గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. కేవలం మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం కాకుండా, మరింత లోతుగా అధ్యయనం చేసే వనరులు, సామర్థ్యం ఉన్న పిటిషనర్లు ఇతరత్రా సమాచారం ఎందుకు చేయలేకపోయారంటూ.. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.. క్రిమినల్ కేసును ఎందుకు నమోదు చేయలేదు అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ఇలాంటి నిఘా చర్యలు వ్యక్తిగత గోప్యత, స్వేఛ్చ, స్వాతంత్ర్యాలకు, గణతంత్ర దేశ సార్వభౌమత్వానికి తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని, తక్షణమే దర్యాప్తుకు ఆదేశాలు జారీచేయాలని పిటీషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. మరి ఇవాళ విచారణ ఏ రకంగా సాగుతుందో చూడాలి.