కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ!

ప్రధాని మోదీ.. ఆదివారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ఈ భేటిలో పాల్గొన్నారు. కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ సండలింపులపై కూడా ఈ సమావేశంలో చర్చింనట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఐదుసార్లు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో మంత్రిత్వ శాఖల పనితీరుపై ఈ సమావేశాల్లో ప్రధాని సమీక్షించిన్నట్లు సమాచారం. ఆయా శాఖల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. 2019లో భాజపా అధికారం చేపట్టిన తర్వాత ఇంతవరకు కేబినెట్‌ విస్తరణ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.