పంజాబ్ కింగ్స్ ఘన విజయం..
IPL 2020లో 6వ మ్యాచ్లో భాగంగా గురువారం రాత్రి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల ( KXIP vs RCB ) మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టుపై పంజాబ్ జట్టు అద్భుతమైన ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ కేఎల్ రాహుల్ (69 బంతుల్లో 132; 14 ఫోర్లు, 7 సిక్స్లు) 132 పరుగుల భారీ స్కోరుతో జట్టుకు భారీ విజయం అందించాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. సన్రైజర్స్ హైదరాబాద్ పై ( SRH vs RCB ) జరిగిన తొలి మ్యాచ్లో మెరుపులు మెరిపించిన ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ కూడా ఈ మ్యాచ్లో ఒక్క పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. జోష్ ఫిలిప్పి డకౌట్ అయ్యాడు. కష్టకాలంలో జట్టును గట్టెక్కించే కెప్టెన్ విరాట్ కోహ్లి (1) సైతం కాట్రెల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రవి బిష్నోయ్ చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ముఖ్యమైన ఆటగాళ్లే ఏమీ చేయలేనట్టు చేతులెత్తేయడంతో ఆ తర్వాతి ఆటగాళ్లంతా వాళ్ల బాటలోనే పెవిలియన్ చేరుకున్నారు. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 97 పరుగుల భారీ తేడాతో Punjab జట్టు చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.