Uttarakhand: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ రాజీనామా

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బుధవారం ఆమె గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపినట్టు రాజ్‌భవన్‌ అధికారి ఒకరు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె రాజీనామా చేసినట్టు అధికారి పేర్కొన్నారు.

బేబీ రాణి మౌర్య 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ పాల్‌ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం బేబీ రాణి మౌర్యను గవర్నర్‌గా నియమించింది. గత నెలతో ఆమె గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయ్యాయి.