మళ్లీ సెట్లోకి అడుగు పెట్టిన ‘వకీల్‌సాబ్‌’

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ కోసం మళ్లీ సెట్లోకి అడుగుపెట్టారు. లాక్‌డౌన్‌ ముగియగానే ఈ చిత్రం కోసం రంగంలోకి దిగిన ఆయన, ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసి కాస్త విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన మరో కీలక ఎపిసోడ్‌కు సిద్ధమయ్యారు. ఈ షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పవన్‌తో పాటు శ్రుతిహాసన్‌ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకున్న ఈ సినిమా.. ఈ తాజా షెడ్యూల్‌తో పూర్తి కానుందని సమాచారం. హిందీ హిట్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్‌, అంజలి కథానాయికలు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.