కరోనా బాధితులకు అండగా.. విజయ్ సేతుపతి భారీ విరాళం!

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నో కుటుంబాలను విషాదంలో ముంచేసింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపట్టాయి. ఇదే సమయంలో బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎందరో ముందుకు వచ్చారు. ముఖ్యంగా పలువురు సినీ సెలబ్రిటీలు భారీ సాయాన్ని అందించారు. తాజాగా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి కూడా తన గొప్ప మనసును చాటుకున్నాడు.

కరోనా బాధితుల సహాయార్థం తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 25 లక్షల విరాళాన్ని సేతుపతి అందించాడు. తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి ఆ మొత్తానికి చెక్కును అందించారు. ఈ సందర్భంగా సేతుపతిని స్టాలిన్ అభినందించారు. ఇప్పటికే పలువురు తమిళ నటులు తమ వంతుగా భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.