జనసేనానికి అపూర్వ స్వాగతం పలికిన చిలకలూరిపేట

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ శ్రేణులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, వీరమహిళలు జిల్లా, మండల కార్యవర్గాల ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా మోతల నడుమ ఆహ్వానం పలికారు. రెండు భారీ గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా పోరాటం చేయాలని జనసేన పార్టీని స్థాపించాను. రైతులు, ఆడపడుచులు, యువతకు అండగా ఉండాలనే ఆలోచనతో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడి ఉన్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 మంది వరకు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాల్లో భరోసా నింపడానికి వెళ్తున్నాను. చిలకలూరిపేటలో ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దసరా తరువాత జనసేన పార్టీ చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా మరోసారి ఈ ప్రాంతానికి వస్తాన”న్నారు.