రైతులకు కష్టం వస్తే ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు.. ధాన్యం కొనాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ రావాలా?

• పంట నష్టపోతే అధికారులు తొంగి కూడా చూడలేదు
• పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండించాం
• మీరు వస్తున్నారు అంటేనే ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యారు
• కడియం ఆవలో శ్రీ పవన్ కళ్యాణ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న రైతులు
• అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్
• రైతు కష్టాలు అడిగి తెలుసుకున్న జనసేన అధ్యక్షులు
• ప్రతి గింజా కొనేవరకు జనసేన పోరాడుతుందని భరోసా

“రైతులు పండించిన ధాన్యం కొనాలి అంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావాలా.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ధాన్యం కొంటామంటే ఆయన మాత్రం ఎన్ని ఊర్లు తిరగాలి? ఎన్ని రోజులు తిరగాలి? ఇళ్లలో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండించాం” అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం ఆవ ప్రాంతం రైతులు తమ గోడును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు వెళ్లబోసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న ప్రాంతాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం పర్యటన చేపట్టారు. రైతుల వద్దకు వెళ్లి గుట్టలుగా పోసి ఉన్న తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అదే ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో హడావిడిగా కొనుగోలు చేసి లారీల్లో లోడ్ చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు చూపించారు. మొలకలు వచ్చేసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలు తెలియచేస్తూ “పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదు.. రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ పాలకులు ఎక్కడ ఉన్నారు.. రైతుకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేముంటామని చెప్పారు.. ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టపోతే పట్టించుకున్న దిక్కు లేదు. ముఖ్యమంత్రి గారు రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రకటించారు. ఆ నిధి ఏమయ్యిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలి. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు? ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయాం. ధాన్యం నల్లపాయ వచ్చేసింది. మాకు వ్యవసాయం తప్ప మరో పని చేతకాదు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతున్నారు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు రైతుల నెత్తినే వేస్తున్నారు. బస్తాకి రూ. 1200 నుంచి రూ. 1300 మాత్రమే వస్తోంది. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదు. రైతు పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనమని అడుగుతున్నాం. మొదట 33 బస్తాలు కొంటామన్నారు. రైతులంతా ధర్నా చేస్తే ఇప్పుడు కొంత పెంచారు.
* తీసుకున్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడొస్తాయో తెలీదు
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాలి. కొంతే కొంటామంటే ఎలా? మీరు(శ్రీ పవన్ కళ్యాణ్ గారు) వస్తున్నారని ఇప్పుడు హడావిడిగా ధాన్యం తోలేస్తున్నారు. తోలిన ధాన్యానికి అక్కడికి వెళ్లాక వంకలు పెడుతున్నారు. దానికీ డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియదు. రైతు భరోసా కేంద్రాలకు చెందిన వాళ్లు, స్థానిక నాయకులు వచ్చి ఒక వంతు ధాన్యం వెళ్లిపోయింది.. మూడొంతుల ధాన్యం వెళ్లిపోయిందని చెబుతున్నారు. ధాన్యం ఇంకా చాలా వరకు కళ్లాల్లోనే ఉంది. మీకు చూపాలనే లోడు చేసిన లారీలు అడ్డుకున్నాం. చివరికి కాలువల్లో పూడిక మేమే తీసుకుంటున్నాం. మరమ్మతులు మేమే చేసుకుంటున్నాం. ఆవలో ఖరీఫ్ మొత్తం నీళ్లలోనే మునిగి ఉంటుంది. రబీ ఒక్కటే మిగిలేది. ఇప్పుడు అకాల వర్షాలకు అదీ పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన పవన్ కళ్యాణ్ పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.