5జీకి వ్యతిరేకంగా పిటిషన్‌…జుహీ చావ్లాకు రూ.20 లక్షలు జరిమానా

దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన దర్మాసనం.. ఆమె ఫిర్యాదును తోసిపుచ్చింది. దేశంలో టెక్నాలజీ అప్ గ్రేడ్ కావాలని స్పష్టం చేసింది. అలాగే కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ.. నటికి రూ. 20 లక్షల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. అంతేకాకుండా.. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆమె అభిమాని పాటలు పాడడం.. అందుకు సంబంధించిన వీడియోను నటి సోషల్ మీడియాలో షేర్ చేయడం పై ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయం గురించి కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ లో సరైన సమాచారం లేదని.. కేవలం పబ్లిసిటి కోసమే పిటిషన్ ధాఖలు చేశారని సీరియస్ అయ్యింది. ఇదిలా ఉంటే.. దేశంలో 5జీ టెక్నాలజీ వలన తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని.. ఈ టెక్నాలజీ వలన ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ లేఖ వచ్చేవరకు 5జీ నెట్ వర్క్ ట్రయల్ ఆపాలని కోరుతూ.. జూహీ చావ్లా సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే జూహీ ఈ పని చేసిందని.. అలాగే కోర్టు సమయాన్ని కూడా వృధా చేసిందని.. ఆమె పిటిషన్‏ను కోర్టు కొట్టివేసింది.