‘పార్లమెంట్‌’ మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని

పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నివాళులర్పించారు. ప్రజాస్వామిక దేవాలయమైన పార్లమెంట్‌పై దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. 2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు. ‘2001లో ఇదే రోజున మన పార్లమెంట్‌పై పిరికిపంద దాడిని మనం ఎన్నటికీ మర్చిపోం. పార్లమెంట్‌ పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయినవారి ధైర్యసాహసాలు, త్యాగాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. వారికి భారత దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు.