అయోధ్య రామాలయ నిర్మాణానికి అక్షయ్ కుమార్ విరాళం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ప్రతివారూ తనమాదిరే ఇందుకు డొనేట్ చేయాలని కోరాడు. అయోధ్యలో ఈ ఆలయ నిర్మాణం కావడం ఎంతో హర్షనీయమని, ఇక మనం కూడా విరాళాలు ఇవ్వాలని అన్నాడు.’నేను మొదలు పెట్టాను, ఇక అంతా నాతో చేతులు కలపాలి’ అని అక్షయ్ పేర్కొన్నాడు. ఇటీవల తనను కలిసిన రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 5 లక్షలకు పైగా విరాళానికి సంబంధించి చెక్కు అందజేశారు. రామాలయ నిర్మాణానికి కేవలం దేశియ విరాళాలను మాత్రమే స్వీకరిస్తామని, విదేశీ డొనేషన్లను తీసుకోబోమని ట్రస్ట్ ప్రకటించింది.

కాగా అయోధ్య ఆలయ నిర్మాణం కోసం బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్ సభ్యులు, కార్యకర్తలు విరాళాలను సేకరించడం ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వివిధ జిల్లాలు, నగరాలు, గ్రామాలలో పర్యటిస్తూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.