అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఇద్దరూ నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచేందుకు అంగీకరించారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, వెలుపల శాంతి భద్రతలను పెంపొందించడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. గత నెలలో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇద్దరు నేతల మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడికి మోదీ అభినందనలు తెలిపారు. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతలపై చర్చించినట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా సహకారాన్ని మరింత పెంచేందుకు అంగీకరించినట్లు తెలిపారు.