రోజుకో మొక్క: శివరాజ్ సింగ్ చౌహాన్

టి ఆర్ ఎస్ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు దేశ, విదేశాలలోనూ మంచి స్పందన వస్తున్నది. రోజు రోజుకి ఉష్ణతాపం పెరిగిపోతుండటంతో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు ప్రతి ఒక్కరు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరుతూ సంతోష్ హరిత ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని సెక్రటేరియట్‌లో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్ మొక్కను నాటారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులు భూమండలానికే ముప్పుగా మారుతున్నాయని, దీని నుంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే కచ్చితంగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే తాను ఓ నిర్ణయం తీసుకున్నానని, ఇక నుంచి ప్రతీరోజు ఓ మొక్క నాటుతానని, దీనిద్వారా వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు కూడా ఏడాదిలో కనీసం ఓ మొక్కనైనా నాటాలలి సీఎం చౌహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగాసీఎం చౌహాన్ నిర్ణయాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.