మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్‌ రాజీనామా..

ముంబయి: మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజయ్ రాథోడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. పూణెకు చెందిన ఓ యువతి ఆత్మహత్య కేసుతో ఆయనకు సంబంధాలున్నాయని ప్రతిపక్ష బిజెపి ఆరోపించిన కొన్ని రోజుల వ్యవధిలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చెత్త రాజకీయాల తప్పుకునేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు సంజయ్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ధాకర్‌కు పంపానని చెప్పారు. మహిళ మరణంతో తనకు సంబంధం ఉన్నట్లు తనపై వస్తున్న ఆరోపణలు కారణంగా తనకున్న గౌరవం పోయిందని, అందుకే ఈ పదవిలో కొనసాగాలని అనుకోవడం లేదని, ఈ విషయంలో వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నిజం త్వరలో బయటపడుతుందని అన్నారు. బీడ్‌ జిల్లాకు చెందిన పూజా చావన్‌ (టిక్‌టాక్‌ ఫేం) పూణెలో తన తమ్ముడు, స్నేహితులతో ఉంటూ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోర్సు నేర్చుకుంటున్నారు. ఈ నెల 8న సదరు యువతి అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె చావు గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణల ఆడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఇందులో ఒకరి వాయిస్‌ సంజయ్ అంటూ బిజెపి నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. కాగా, ఈ ఆరోపణలను సంజయ్ కొట్టిపారేశారు. పోలీసులు సైతం ఇది ఆత్మహత్య కనిపిస్తున్నప్పటికీ..హత్య కోణంలో కూడా విచారిస్తున్నామని గతంలో వెల్లడించారు.