ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఆప్ విజయ కేతనం…
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార ఆప్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం ఐదు సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు వార్డులను ఆప్ కైవసం చేసుకోగా… కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా, బిజెపి కి ఒక్క సీటు కూడా దక్కలేదు. గెలిచిన అభ్యర్థులకు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. 2022 అసెంబ్లీ ఎన్నికలకు బిజెపికి ఇదో సందేశమని అన్నారు. కేంద్రంలోని బిజెపి పాలనతో ప్రజలు విసుగు చెందారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. కళ్యాణ్పురి, రోహిణీ-సి, త్రిలోక్పురి, షాలిమార్ భాగ్లో విజయ కేతనం ఎగురవేయగా… చౌహాన్ భంగర్లో కాంగ్రెస్ గెలుపొందింది. నలుగురు సిట్టింగ్ కౌన్సిలర్లు… ఎమ్మెల్యేలుగా గెలుపొందగా… ఒక స్థానంలో బిజెపి కౌన్సిలర్ మృతి చెందడంతో ఈ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.