హామీలను అమలు చేయడమే మా నినాదం: మోదీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బిహార్‌లోని దర్భంగాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓట్లు వేసే సమయంలో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. రామ మందిర నిర్మాణం ఆరంభం నేపథ్యంలో బిహారీలకు మోదీ అభినందనలు తెలిపారు. ‘రామ మందిర నిర్మాణం మొదలైనందున సీతమ్మ కొలువైన రాష్ట్ర (బిహార్) ప్రజలకు అభినందనలు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడమే మా నినాదం’ అని మోదీ చెప్పారు. ఈ ర్యాలీలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. దర్భంగాలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు ప్రధాని మోదీకి నితీశ్ కృతజ్ఞతలు తెలిపారు.