రంగంలోకి జనసేనాని.. తిరుపతిలో ఏప్రిల్ 3న ప్రచారం..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.. పార్లమెంట్ స్థానంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించి పని మొదలుపెట్టింది అధికార వైసీపీ.. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తిరుపతిలో మకాం వేశారు. ఇక, తిరుపతి ఉప ఎన్నికల కోసం.. బీజేపీ, జనసేన పార్టీ నేతలు కూడా పని మొదలుపెట్టారు.. జనసేన అధినేత పవనల్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు.. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి సమయం ఇచ్చారు.. ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారు జనసేనాని. ఇవాళ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో పాదయాత్ర నిర్వహిస్తారని.. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కల్యాణ్ పాదయాత్ర సాగుతుందని.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ పాదయాత్ర నిర్వహిస్తారని.. 3వ తేదీన పాదయాత్ర తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు శంకరంబాడి సర్కిల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు నాదెండ్ల మనోహర్. ఇక, ఈ పాదయాత్రలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పుకొచ్చారు.