సోనూసూద్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
కరోనా కష్టకాలంలో అందరికి ఆపద్భాందవుడిగా నిలిచిన సోనూసూద్ సాయాలు చేసుకుంటూనే వెళుతున్నారు. గత ఏడాది వలస కార్మికులతో పాటు ఇతర ప్రదేశాలలో చిక్కుకున్న వారిని సొంతింటికి తరలించేందుకు సోనూసూద్ ఎంతో కృషి చేశారు.ఇక ఈ ఏడాది ఆక్సిజన్ దొరక్క చాలా మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో సోనూసూద్ అనేక ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఆయన పేరుతో కొందరు మోసాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది.
సోనూసూద్ పేరుతో పాటు ఆయన ఫొటో పెట్టుకొని ఓ ఫౌండేషన్ విరాళాలు సేకరిస్తుండగా, దానిపై తన ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. నాకు, ఆ ఫౌండేషన్కు ఎలాంటి సంబంధం లేదంటూ సోనూ స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు.