సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత తమకు ముఖ్యమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఒత్తిడితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్ష రాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని సూచించారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షల ఫలితాల గురించి త్వరలో వెల్లడిస్తామన్నారు.
Government of India has decided to cancel the Class XII CBSE Board Exams. After extensive consultations, we have taken a decision that is student-friendly, one that safeguards the health as well as future of our youth. https://t.co/vzl6ahY1O2
— Narendra Modi (@narendramodi) June 1, 2021