కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న భారత్ కు మేం బాసటగా నిలుస్తాం: చైనా

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తుండడం పట్ల చైనా సానుభూతి వ్యక్తం చేసింది. ఇవాళ బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో కరోనా పరిస్థితులు తీవ్రస్థాయిలో ఉండడం పట్ల వాంగ్ యి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ కష్టకాలంలో ఇతర బ్రిక్స్ దేశాలతో కలిసి చైనా కూడా భారత్ కు సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. భారత్ లో సంక్షుభిత పరిస్థితులు కొనసాగినంత కాలం చైనా సహా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఏ సమయంలోనైనా భారత్ కు తమ మద్దతు ఉంటుందని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితులను భారత్ తప్పకుండా అధిగమిస్తుందన్న నమ్మకం తమకుందని పేర్కొన్నారు.