ట్విట్టర్ ఇండియా ఎండీకి నోటీసులు పంపిన యూపీ పోలీసులు !

భారత్ లో ట్విట్టర్ కి గత కొన్ని రోజులుగా గడ్డుకాలం నడుస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఐటీ నింబంధనలు అమలు చేయడానికి ట్విట్టర్ ఒప్పుకోకపోవడంతో దానికి తగ్గ ప్రతిఫలం వెంటనే కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో ట్విట్టర్ పై రెండు కేసులు నమోదు కాగా తాజాగా ఈసారి పోలీసులు ఏకంగా ఇండియా ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కే లీగల్ నోటీసులు పంపించారు. అసలేం జరిగిందంటే .. ఉత్తరప్రదేశ్ లోని లోనిలో ఓ వృద్ధుడిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి రాష్ట్ర పోలీసులు లీగల్ నోటీసు ఇచ్చారు. విద్వేష ప్రచార సందేశం వైరల్ కావడంపై రికార్డ్ స్టేట్ మెంట్ ఇవ్వాలని ఆ నోటీసులో పోలీసులు తెలిపారు. యూపీలో లోని బోర్డర్ లోని పోలీసు స్టేషన్ కు వచ్చి ఏడు రోజుల్లోగా స్టేట్మెంట్ రికార్డు చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చెసారు. సమాజంలో విద్వేష వ్యాప్తికి కొందరు వ్యక్తులు ట్విట్టర్ ను ఒక ఉపకరణం చేసుకుంటున్నారని దానిపై ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియా ట్విట్టర్ ఐఎన్ సీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని ఆ నోటీసులో యూపీ పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలకు పాటించకపోవడంతో దేశంలో మధ్యవర్తిత్వ వేదక హోదాను ఇటీవల ట్విట్టర్ కోల్పోయిన నేపథ్యంలో యూపీ పోలీసులు ట్విట్టర్ కు తాజా నోటీసులు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రానికి సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కు మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విట్టర్ కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ఇకపై యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు ఇతరత్రా చర్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.