కీలక కేబినెట్‌ కమిటీల్లో మార్పులు.. స్మృతి ఇరానీ, భూపిందర్‌లకు చోటు

ఇటీవల కేంద్ర కేబినెట్‌ విస్తరణ చేపట్టిన మోడీ ప్రభుత్వం క్యాబినెట్‌ కమిటీలను కూడా పునర్‌వ్యవస్థీకరించింది. మంత్రులు భూపిందర్‌ యాదవ్‌, సర్బానంద్‌ సోనోవాల్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, గిరిరాజ్‌ సింగ్‌, స్మృతి ఇరానీలకు రాజకీయాలకు సంబంధించిన అన్ని కీలక కేబినెట్‌ కమిటీల్లోనూ స్థానం కల్పించింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీలో న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లకు మొదటి సారి చోటు దక్కింది. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా కూడా ఈ కమిటీలో ఉన్నారు. రవిశంకర్‌ ప్రాసద్‌ స్థానంలో కిరణ్‌ రిజిజు, ప్రకాష్‌ జవదేకర్‌ స్థానంలో ఠాకూర్‌ను ఈ కమిటీలో తీసుకున్నారు. తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ స్థానంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌, అర్జున్‌ ముండా, ప్రహ్లాద్‌ జోషి, కిరణ్‌ రిజిజు, అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌లు కూడా ఉన్నారు.