అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌లోని డల్లాస్‌ పరిధి అర్లింగ్టన్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఓ విద్యార్థి (18) కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు కాల్పులకు దిగడంతో అక్కడ ఉన్నవారంతా పారిపోతుండగా నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరోవైపు పోలీసులు కాల్పులు జరిపిన విద్యార్థి కోసం గాలింపు చేపట్టి అరెస్టు చేశారు. టింబర్‌వ్యూ పాఠశాలలో మొత్తం 1,900 విద్యార్థులు చదువుతున్నారు. కాల్పులు చోటుచేసుకోసున్న విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాఠశాలకు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.