ప్రధాని మోదీ ఆస్తుల, అప్పుల వివరాలు

ప్రధాని నరేంద్రమోదీ తన ఆస్తులు, అప్పుల వివరాలను బహిర్గతం చేరశారు. ఈ గుణాంకాలు జూన్‌ 30 నాటికి ఆయన ఆర్థిక స్థితిగుతులను వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే మోదీ ఆస్తుల విలువ రూ.36.53 లక్షలు పెరిగింది. ఆయన చరాస్తుల విలువ రూ. 1,39,10,260 నుంచి రూ. 1,75,63,618కి పెరిగింది. ఒక మధ్య తరగతి వ్యక్తి మాదిరే ఆయన తన జీతంలో అధిక భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్సుడు డిపాజిట్లు చేశారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ లో తన కుటుంబంతో కలిపి ఇల్లు, స్థలం ఉన్నాయి. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య ఆదాయ వనరు ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతం. దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడంతో పాటు, వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని సన్నిహితులు తెలిపారు.

స్థిరాస్తుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. గాంధీనగర్ లో ఉన్న ఇల్లు, స్థలం విలువ రూ. 1.1 కోట్లు. ఆయనకు జీవిత బీమా ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో కూడా పొదుపు చేశారు. జూన్ 30 నాటికి ఆయన పొదుపు ఖాతాలో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. ఆయన వద్ద నగదు రూపంలో రూ. 31,450 ఉన్నాయి.