జెండా దిమ్మెల ధ్వంసంతో జనసేన ప్రస్థానాన్ని ఆపగలరా?
•జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన మహేష్ అరెస్టు అప్రజాస్వామికం
•వైసీపీ దౌర్జన్యాలను జనసేన బలంగా ఎదుర్కొంటుంది
జనసేన పార్టీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి పక్షాన పోరాడుతుంటే అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని- విజయవాడలో రాయల్ హోటల్ సెంటర్లో పార్టీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైతే వైసీపీ వాళ్ళు అడ్డుకొని జెండా దిమ్మెను ధ్వంసం చేయడం పాలక పక్షం వైఖరిని తెలియచేస్తోంది. వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకొన్నందుకు మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడైన శ్రీ పోతిన మహేష్, ఇతర నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అప్రజాస్వామికం. జనసేన జెండా దిమ్మెను పగలగొట్టిన వారిపై కాకుండా, ఆ దుశ్చర్యను అడ్డుకొన్నవారినే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి కేసులు పెట్టడం ఏమిటి? వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ప్రజల ముందుకు వెళ్తున్నవారిని కట్టడి చేసేందుకే ఈ విధమైన కేసులు నమోదు చేస్తున్నారు. జెండా దిమ్మెలు ధ్వంసం చేసినంత మాత్రాన జనసేన ప్రస్థానాన్ని ఆపలేరని అధికార పక్షం గ్రహించాలి. జనసేన జెండా చూస్తేనే భయపడి అక్కసుతో దాడి చేస్తున్నారని మరోసారి రుజువైంది. మొన్న జగ్గయ్యపేటలో, నేడు విజయవాడలో జనసేన జెండా చూసి వైసీపీ నాయకులు భయపడ్డారు. వీళ్ళు చేసే దౌర్జన్యాలను జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. ఎప్పటికప్పుడు వీళ్ళ దుష్ట పాలనను ప్రజా క్షేత్రంలో నిలదీస్తాం అని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.